పరిగి, నవంబర్ 7 : 18 సంవత్సరాలు నిండినవారందరూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడు చంపాలాల్ తెలిపారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ నిఖిలతోపాటు రెవెన్యూ అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సర ఓటరు జాబితాలో సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 1 2022 నాటికి 18 ఏండ్లు నిండినవారిని గుర్తించి ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేయించాలని ప్రజాప్రతినిధులను కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. చనిపోయినవారిని, శాశ్వతంగా వలస వెళ్లినవారిని గుర్తించి ఫారం-7 ద్వారా వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు సహకరించాలని తెలిపారు. ఒక వ్యక్తి పేరు వేర్వేరు రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటరుగా నమోదు కాబడితే ఫారం-8 ద్వారా సరిచేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, అక్షేపణలు ఉంటే స్థానిక ఆర్డీవో, తహసీల్దార్లను సంప్రదించాలన్నారు. తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని సంగం లక్ష్మిబాయి ఉన్నత పాఠశాలలోని శివారెడ్డిపేట, నస్కల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బీఎల్వో, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడి నమోదు ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, స్విప్ నోడల్ అధికారి కోటాజీ, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్రెడ్డి, అశోక్కుమార్, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులున్నారు.