హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయాల టర్నోవర్ను వచ్చే మూడేండ్లలో రూ.1,500 కోట్లకు (ప్రస్తుతం రూ.800 కోట్లు) పెంచాలని, అందుకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల మారెటింగ్, నూతన ఔట్లెట్ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాలపై డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, డెయిరీ ఇంచార్జి ఎండీ అనిత రాజేంద్రతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అత్యుత్తమ నాణ్యత కలిగిన విజయ ఉత్పత్తులకు ఉన్నతస్థాయి మారెటింగ్, విసృ్తత ప్రచారాన్ని కల్పించే పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
సమగ్ర నివేదికలను రూపొందించి వచ్చే నెల 16న నిర్వహించే బోర్డు సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు. ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, జాతీయ రహదారుల వెంట విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ విద్యాసంస్థలకు విజయ ఉత్పత్తులను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని చె ప్పారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా వారం లో 4 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి విజయ ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నష్టాలలో ఉన్న విజయ డెయిరీ ప్రభుత్వ సహకారం, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఫలితంగా లాభాల బాట పట్టిందని అభినందించారు. మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని మంత్రి తలసాని సూచించారు.