అమరావతి : బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి అని ఏపీకి చెందిన ప్రముఖులు అన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏపీ సీఎం జగన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ గిడుగు జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేశారని కొనియాడారు.
వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు గిడుగు రామ్మూర్తి అని పేర్కొన్నారు. తెలుగు భాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారని వివరించారు. గిడుగు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తెలుగును కాపాడుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఏపీ స్కూళ్లలో తెలుగు మాధ్యమం మాయమవుతుందని వింటే బాధగా ఉందని అన్నారు.
భాషాప్రాతిపదికగా ఏర్పడిన తొలిరాష్ట్రంలో ఇలా జరగడం దురదృష్టకరమని వెల్లడించారు. తెలుగు భాష, సంస్కృతి కాపాడుకునేందుకు పునరంకితమవుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లిభాష అని చంద్రబాబు అన్నారు.