కాసర్గోడ్, అక్టోబర్ 10: కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ పరిసర సరస్సులో దాదాపు ఏడు దశాబ్దాలుగా నివసిస్తున్న శాకాహార మొసలి మృతిచెందింది. ఇది ఆలయంలో పెట్టే ప్రసాదం మాత్రమే తినేది. అప్పుడప్పుడు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనూ తిరుగుతూ కనిపించేది. తాము బాబియాగా పిలుచుకునే మొసలి శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిందని, ఆదివారం రాత్రి దాని మృతదేహం నీళ్లపై తేలుతూ కనిపించిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మొసలి చివరి దర్శనం కోసం వేలాది మంది తరలిరావడంతో మృతదేహాన్ని సరస్సు నుంచి తొలగించి, సందర్శనార్థం ఉంచారు. అనంతరం మొసలికి అంత్యక్రియలు నిర్వహించారు.