మనం సమీకృత ఆహారం తీసుకోవాలంటే బియ్యం ఒక్కటే సరిపోదు. కూరగాయలు, ఆకుకూరలతో సహా భిన్నరకాల ఆహారపదార్థాలను తినాలి. ఇందుకుగాను రాష్ట్రంలో భిన్నరకాల ఆహార పంటలను పండించవలసిన అవసరం ఉన్నది. వరి మాత్రమే పండించి అమ్ముకోవడానికి ఇబ్బందులు పడే బదులు, మార్కెట్ అవసరాలను తీర్చే ఇతరపంటల వైపు మళ్ళడం మంచిది. మన రాష్ట్ర అవసరాలను పరిశీలిస్తే వరికి బదులుగా కూరగాయలను పండించడం లాభసాటిగా చెప్పుకోవచ్చు. దీనివల్ల రైతుకు లాభాలు రావడమే కాకుండా మన సమాజ అవసరాలు కూడా తీరుతాయి.
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరుతున్నది. ఈ విధమైన పంటల్లో మొదటగా చెప్పుకోవలసింది కాయగూరలు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 100 గ్రాముల పండ్లు, 300 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. అందులో 50 గ్రాములు ఆకుకూరలు, 50 గ్రాములు దుంప కూరలు ఉండాలి. మిగతా 200 గ్రాములు ఇతర కూరగాయలు ఉండాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 225 గ్రాముల కూరగాయలు మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే 75 గ్రాములు తక్కువగా తింటున్నారు. గణాంకాల ప్రకారం హైదరాబాద్ నగర వినియోగదారులకు రోజుకు సగటున 7,500 క్వింటాళ్ల కూరగాయలు అవసరం. కొవిడ్ నేపథ్యంలో వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కూరగాయలు వినియోగిస్తున్నారు. కొవిడ్ వల్ల నగరవాసులు నెలకు 8 కిలోలకు బదులుగా 12 కిలోలు వినియోగిస్తున్నారు. అయితే నగర అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా రాష్ట్రంలో కూరగాయలు ఉత్పత్తి కావడం లేదు. అందువల్ల ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల చిత్తూరు నుంచి టమాటాను హైదరాబాద్కు రవాణా చేయడంలో అంతరాయం ఏర్పడి ధరలు బాగా పెరిగాయి. దీన్ని బట్టి మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకోవలసిన అవసరం ఎంత ఉన్నదో తెలుస్తున్నది. ఏ విధంగా చూసినా కూరగాయల అవసరం బాగా పెరిగింది. ఒక హైదరాబాద్లోనే కాదు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో, జిల్లా కేంద్రా ల్లో, మండలాల్లోనూ ఉన్నది. కూరగాయల ధరలు మండిపోవడానికి కారణం కూరగాయల సరఫరా డిమాండ్కు తగినట్టుగా లేకపోవడమే.
లాభాలనేకం: యాసంగిలో వరితో పోలిస్తే కూరగాయల సాగు వల్ల అనేక లాభాలున్నాయి. మొదటిది- వరిపై పెట్టుబడి తిరిగి రావాలంటే కనీ సం 120 నుంచి 150 రోజులు ఆగాలి. కానీ కూరగాయలు సాగు చేస్తే 45 రోజుల నుంచే అన్నిరకాల కూరగాయల్లో దిగుబడులు మొదలవుతాయి. దీనికితోడు వరికి పని దినాలు ఎక్కువ. కూరగాయలైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక పంట దెబ్బతిన్నా రైతు తక్కువ నష్టంతో బయటపడవచ్చు. ఒక కిలో వడ్లు ఉత్పత్తి చేయడానికి 3 నుంచి 5 వేల లీటర్ల నీరు అవసరం. అదే నీటితో పది కిలోల టమాట లేదా వంకాయ లేదా మిరప వంటి కూరగాయలను ఉత్పత్తి చేయవచ్చు. అంటే వరికి సరిపోయే నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంటలను సాగు చేసుకోవచ్చు. కూరగాయల సాగు వల్ల ఎండకాలంలో కూడా నీటి ఎద్దడి ఉండదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల సాగునీటి లభ్యత బాగా పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. కాబట్టి వేసవిలో సైతం సాగునీటి కొరత ఉండే అవకాశం లేదు. అంటే ఏ మాత్రం సాగునీరు అందుబాటులో ఉన్నా రైతులు భేషుగ్గా కూరగాయ పంటల సాగు చేపట్టవచ్చు.
రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు కూడా కూరగాయల సాగుకు అనుకూలం. రాష్ట్రంలో 46 శాతం ఎర్ర నేల ఉన్నది. ఈ నేలల్లో అన్నిరకాల కూరగాయలు సాగు చేసుకోవచ్చు. అలాగే రసాయనాల అవశేషాలు లేని సేంద్రియ కూరగాయల సాగుకు అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం పండ్లు, కూరగాయల సాగును భారీగా ప్రోత్సహిస్తున్నది. బిందు, తుంపర సేద్య సదుపాయంతో పాటు 80 నుంచి 100 శాతం సబ్సిడీతో పరికరాలను అందిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు ఉన్న అనుకూల వాతావరణం నేపథ్యంలో వచ్చే ఐదేండ్లలో దాదా పు 30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ వంటి తోట పంటలను పండించేందుకు ప్రభుత్వం మొక్కలను అందిస్తున్నది. నాటేందుకు, పెంచుకునేందుకు సబ్సిడీతోపాటు నూనె తీసేందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది.
హైదరాబాద్ నగరం చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో కూరగాయలు పండిస్తే హైదరాబాద్ మార్కెట్ను ఉపయోగించుకోవచ్చు. నగర సమీపంలో సాగు చేస్తున్న రైతులు ఈ అనుకూలాంశాన్ని అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ సమీపంలో ఉన్నవారు తాజా కూరగాయలను మార్కెట్కు చేరవేయగలరు. దీనివల్ల ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉన్నది.
పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు తోనే ఆకుకూరలను సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం సాగులో ఉన్న కూరగాయలకు అదనంగా మరో 4, 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలను సాగు చేసినా డిమాండ్ కచ్చితంగా ఉంటుంది. కాబట్టి రైతులు వరి బదులు కూరగాయల సాగుతో లాభాలు పొందవలసిన సమయం ఇది. ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకొని రైతులు ఈ విధంగా లాభపడాలి.
(వ్యాసకర్త: అసోసియేట్ ప్రొఫెసర్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)
వరి పంటలో సేంద్రియ సాగుకు అవకాశం లేదు. దశాబ్దాలుగా వరిని మాత్రమే సాగు చేయడం వల్ల భూములు నిస్సారం అయ్యాయి. కూరగాయల సాగు వల్ల పంట వైవిధ్యం పెరిగి భూములు బాగుపడతాయి. చీడపీడల సమస్య తగ్గుతుంది. కూరగాయలు, పండ్లు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయినా భయం లేదు. వీటిలో విలువల జోడింపునకు అవకాశం ఎక్కువ.
డాక్టర్ పిడిగెం సైదయ్య
77805 09322