కన్నాయిగూడెం, మార్చి 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ అసలైన రైతుబంధు అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. దేవాదుల, ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టు ను స్థిరీకరించేందుకు నిర్మించిన సమ్మక్క బరాజ్ను సీఎం కేసీఆర్ పూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లాకే కేటాయించారని చెప్పా రు. జనగామ, ములుగు జిల్లాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి సమ్మక్క బరాజ్ను శుక్రవారం సందర్శించి బరాజ్పై సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు 100 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సమ్మక్క బరాజ్ను నిర్మించారని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గోదావరిపై వరుసగా బరాజ్ల ను నిర్మించి నదికి జీవకళ తెచ్చిన కేసీఆర్ అపర భగీరథుడు అని కొనియాడారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసిన సీఎం కేసీఆర్కు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో దేవాదుల పంప్హౌస్ వద్ద వానకాలంలో తప్ప నీళ్లుండక పో యేవని చెప్పారు. గోదావరి నది జనవరి నుంచి జూన్ వరకు ఎండిపోయి ఉండేదని, సీఎం కేసీఆర్ నిర్మించిన బరాజ్లతో ఇప్పుడు నిత్యం నీళ్లు ఉంటున్నాయన్నారు. తెలంగాణలో గోదావరి 417 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని, సీఎం కేసీఆర్ గొప్ప దూరదృష్టితో గోదావరి పొడవునా సదర్మాట్, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క బరాజ్లు, సీతారామ ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. అన్ని బరాజ్లతో గోదావరి తెలంగాణలో జీవనదిగా మారిందన్నారు. సాగునీటి రంగం అభివృద్ధిపై కేసీఆర్ ఆలోచన, ప్రణాళిక, కార్యాచరణ, వనరుల సమీకరణ, మౌలిక వసతుల కల్పనతో గోదావరి నీటిని పూర్తిగా వినియోగంలోకి తెచ్చారన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి గ్రామీణ నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. 2020-21లో రాష్ట్రంలో కోటి పది లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 3 కోట్ల టన్నుల ధాన్యం పండిందని పేర్కొన్నారు. దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణలోనే వరి ఎక్కువగా సాగవుతున్నదని చెప్పారు. కేసీఆర్ దృఢసంకల్పం, దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య, గడదాసు సునిల్కుమార్, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, కావిరి చిన్నికృష్ణ, వెంకటేశ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ వలియాబీ, సర్పంచ్లు కొట్టె ఉమామహేశ్వరి, నారాయణ ఉన్నారు.