ముషీరాబాద్, డిసెంబర్ 17: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన బీజేపీకి తగిన బుద్ది చెప్పడానికి మాదిగలు, మాదిగ ఉప కులాలు సిద్ధంగా ఉన్నాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ కోసం వందలాది మంది మాదిగ బిడ్డలు ప్రాణత్యాగం చేసినా కేంద్రం వర్గీకరణ చేయకుండా మొండివైఖరి అవలంభిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే బీజేపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు శ్యామ్రావు, పొట్టపెంజర రమేశ్, బంగారు శ్రీను, మంచాల యాదగిరి, రాజేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.