“స్వాతంత్య్రం వచ్చిన కాడినుంచి ఏ పార్టీ ఏ ప్రభుత్వం .. ఏమీ చెయ్యలే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ చేస్తున్నది. 50 ఏళ్ల కింద నూకలు, ఎర్ర జొన్నలు, కొర్రలు తిని బతికినోల్లం. గిప్పుడు సీఎం కేసీఆర్ చలువతో కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు వస్తుండడం వల్ల పంటలు బాగా పండి.. ఐదేండ్లుగా మేము కూడా దొరల్లెక్క సన్నబియ్యం తింటున్నం. నిజంగా కరువొస్తే మల్లీ నూకలు తిని బతుకుతం. కానీ ఇక్కడ పండే వడ్లను కొనమని అడిగి.. కేంద్రపోల్లు మమ్మల్ని నూకలు తినమని అనడం రైతులనే కాదు… మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే…” అని బీబీగూడెం ఆవాసం భీక్యాతండాకు చెందిన 75 ఏళ్ల గిరిజన రైతు, గ్రామ మాజీ సర్పంచ్ ధరవత్ భిక్షంనాయక్ అన్నారు. చిన్నతనం నుంచి తాత, తండ్రికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటూనే రాజకీయాల్లో తిరుగుతున్నానని ఆనాటి నుంచి నేటి వరకు రాజకీయాలు, వ్యవసాయం, పంటల విక్రయాల తీరు తెన్నులపై నమస్తే తెలంగాణతో ముచ్చటించారు.
మా తాతకు 50 ఏండ్ల క్రితం భీక్యాతండాలో 14 ఎకరాల వ్యవసాయ భూమి, 30 ఫీట్ల బావి ఉండేది. కానీ కేవలం 10 గుంటలు సాగు చేసి 20 మంది కుటుంబ సభ్యులం జీవనం సాగించేవాళ్లం. ఇప్పటికీ మేం నలుగురం అన్నదమ్ములమే కాదు మా కొడుకులు కూడా వేరు పడకుండా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నం. ఆ నాడు రేయింబవళ్లు మోటలు తోలి 10 గుంటల్లో పండించే కొద్దిపాటి వడ్లు అమ్మి జొన్నలు, కొర్రలు తినేవాళ్లం. ఎప్పుడో పండుగలకు నూకలు తెస్తే అవే మాకు పరమాన్నం. 40 ఏండ్ల క్రితం కరెంట్ వస్తే మాకున్న 14 ఎకరాల్లో ఒక ఎకరం సాగైంది. మరో 15 ఏండ్ల తరువాత బోర్లు రావడంతో సాగు రెండెకరాలకు చేరినా కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గటక తిన్నాం. అయితే తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక 2018లో తొలిసారి గోదావరి నీళ్లు రావడంతో 10 ఎకరాలు సాగు చేయగా.. మూడేండ్లుగా మొత్తం 14 ఎకరాల్లో వరి పండిస్తున్నాం.
నేను వ్యవసాయం చేస్తూనే రాజకీయాల్లో తిరుగుతున్న. 1981లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచిన. తర్వాత తెలుగుదేశం పార్టీలో .. తదనంతరం టీఆర్ఎస్లో చేరాను. మూడు పార్టీల్లో పనిచేసిన అనుభవంతో చెబుతున్నా… తెలంగాణకు కేసీఆర్ లాంటి నాయకుడు 30 ఏండ్ల కిందనే వస్తే ఇయ్యాల రాష్ట్రం ఇంకా ఎట్ల ఉండేదో. నాడు వ్యవసాయాన్ని ఎవ్వరూ పట్టించుకోలే.. ఇయ్యాల వ్యవసాయం అంటేనే సీఎం కేసీఆర్ అన్నట్లుగా ఉంది. రైతులు ఎంతో గర్వంగా మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పుకునేలా చేశారు. కరెంటు ఉచితంగా ఇస్తుండ్రు, నీళ్లు పుష్కలంగా వస్తున్నయ్, పెట్టుబడి సాయం ఏడాదికి రెండు సార్లు, ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నరు. ఎరువులు, విత్తనాలకు ఇబ్బందులు లేవు. దాంతో ఏడేండ్ల కింద ఇక్కడ ఎకరానికి లక్ష రూపాయలు కూడా ధర లేకపోయేది. ఇప్పుడు అదే భూమి కోట్ల రూపాయలు పలుకుతోంది.
దశాబ్దాల నుంచి చూస్తున్నా… రైతులతో పెట్టుకున్నోడు ఒక్కడూ బాగుపడలేదు. రైతులను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పతనమైంది. రైతులను తుపాకులతో కాల్చి చంపిన తెలుగుదేశం నామరూపాల్లేకుండా పోయింది. మొన్న పంజాబ్ రైతులతో పెట్టుకుంటే.. అక్కడా బీజేపీ ఖతమైంది. ధాన్యం కొనకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టాలని కేంద్రంలోని బీజేపీ చూస్తే.. రైతులంతా కలిసి ఆ పార్టీ భరతం పడతాం. ధాన్యం కొనమంటే.. పండిన పంటను నూకలు చేసుకొని తినమని చెప్పిన గోయల్కు శరముందో లేదో కానీ ఆయన పార్టీకి మాత్రం నూకలు చెల్లినట్లే.
50 ఏండ్ల కింద మాకు సుమారు కింటన్నర వడ్లు పండితే సూర్యాపేటలో వీధుల వెంట కూర్చుని కొనే వ్యాపారులకు అమ్మేవాళ్లం. తరువాత మార్కెట్లు రావడం అక్కడే .. లేదంటే మిల్లుల్లో అమ్ముకున్నం. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్నేండ్లుగా ఊర్లలోనే సెంటర్లు పెట్టి మద్దతు ధరకు ధాన్యం కొని ఎఫ్సీఐకి ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పోయినేడు నుంచి కేంద్రం ధాన్యం కొనదనే వార్తలు వింటున్నాం. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు ఢిల్లీ చుట్టూ తిరిగి.. రాష్ట్రంలో కూడా ఆందోళన చేస్తేనే మొన్నటి సీజన్ వరకు కొన్నరు. దేశంలో వేరే రాష్ర్టాల్లో పండే వడ్లు కేంద్రం కొంటుందని పేపర్లలో ఇస్తున్నరు.. ఈ సారి తెలంగాణలో అసలే కొనమని చేతులెత్తేయడం అంటే మనపై కుట్రలు చేయడమే అని అర్థమవుతున్నది.