రవీంద్రభారతి, మే 23 : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలు మానుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. శనివారం బషీర్బాగ్ చౌరస్తాలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.10వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థులకు కల్లబొల్లి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని, గద్దెనెక్కిన తరువాత వారిని విస్మరించిందని ధ్వజమెత్తారు. పేద, బడుగు బలహీనవర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని, అందుకే ఫీజు బకాయిలు చెల్లించడంలేదని ఆరోపించారు.
దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేసి గ్రామాల్లో కూలీలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో జూన్లో విద్యార్థులతో కలిసి భారీ ఉద్యమాలు చేపడుతామని శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఫీజు బకాయిలు ఇవ్వడం లేదని ఆరోపించారు.