డెహ్రాడూన్ : చార్ధామ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల గర్భగుడిలో జరిగే జరిగే పూజ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామని స్పష్టం చేశారు. వేదాల్లో ప్రస్తావించనందున ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగదని చెప్పారు. పరిమిత సంఖ్యలో యాత్రికులతో చార్ధామ్ యాత్రకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. అలాగే ఆలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు. సలహాలు, సూచనలన్నీ తీసుకున్న తర్వాత ‘చార్ధామ్ యాత్రను లైవ్ ప్రసారం చేయదలచుకోలేదు. అలా చేయాలని వేదాల్లో కూడా రాసి లేదు’ అని తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది దేశం నలుమూలల నుంచి భక్తులను యాత్రకు అనుమతించిన సందర్భంలో రోజుకు 70 మంది గంగోత్రిని, 40 యమునోత్రిని, 180 మంది కేదార్నాథ్ను, 400 మంది బద్రీనాథ్ను సందర్శించారు.