అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండవ దశ పనుల్లో భాగంగా ఇవాళ రామాలయానికి చెందిన గర్భగుడి నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గర్భగుడికి శంకుస్థాపన పూజ చేశారు. తొలి దశ పనుల్లో రామ మందిర నిర్మాణంలో భాగంగా ఫ్లాట్ఫామ్ను నిర్మించారు. ఇప్పుడు రెండవ దశ పనుల్లో భాగంగా గర్భగృహాన్ని నిర్మించారు. దీని కోసం ఇవాళ సీఎం యోగి శంకుస్థాపన పూజ చేశారు.
#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath pours cement on the stones during the foundation stone laying ceremony of Ram Mandir's Garbhagriha in Ayodhya. pic.twitter.com/XfONb0sYCs
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 1, 2022
అయితే ఆలయ నిర్మాణంలో కీలకమైన పనులను ఇవాళ ప్రారంభిస్తున్నట్లు అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మెన్ నిపేంద్ర మిశ్రా తెలిపారు. రెండవ దశ పనులను మూడు అంచెల్లో చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. 2023 లోగా ఆలయ గర్భగృహాన్ని నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. ఇక 2024 లోపు ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. ఇక ఆలయ నిర్మాణంలో భాగమైన కాంప్లెక్స్ను 2025లోగా పూర్తి చేస్తామని నిపేంద్ర మిశ్రా చెప్పారు.
అయోధ్య రామ మందిరం జాతీయ ఆలయంగా మారుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ రోజు కోసం దేశ ప్రజలు ఎంతో వేచి చూస్తున్నారని అన్నారు. భారతీయ ఐక్యతకు రామ మందిరం చిహ్నంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. రెండేళ్ల క్రితం అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ప్రధాని మోదీ పూజలు చేశారని, నిర్మాణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, గర్భగుడి నిర్మాణానికి చెందిన పనులు ఇవాళ ప్రారంభం కావడం అద్భుతమని యోగి తెలిపారు.