ఎండాకాలం బరువు తగ్గడం సులభం అంటారు. ఆరోగ్యంగా సన్నబడేందుకు మీ సలహా?
– ఓ పాఠకురాలు
ఎండాకాలం విపరీతమైన వేడి వల్ల బాగా దాహం వేస్తుంది. దీంతో ఘనాహారం సరిగ్గా తినలేం. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం. మనకు తెలియకుండానే తక్కువ కేలరీలు అందుతాయి. అంతేకాదు, చెమట పట్టడం వల్ల శరీరంలోని నీరు బయటికి వెళ్తుంది. ఎండాకాలం బరువు తగ్గడానికి ఇదొక కారణం. అయితే, ప్రత్యేకించి బరువు వదిలించుకోవాలని భావించే వారు దీన్ని మంచి అవకాశంగా భావించాలి. రాగి జావ, బార్లీ నీళ్లు, సబ్జా గింజలు కలిపిన మజ్జిగలాంటి తక్కువ కేలరీలు ఉండే ద్రవాలకు ప్రాధాన్యమివ్వాలి. ఈ సమయంలో దొరికే పుచ్చకాయ, పచ్చ ద్రాక్షలాంటివి తినాలి.
ఇవి కూడా వెయిట్లాస్కు సహకరిస్తాయి. మామిడి కూడా మంచిదే. అయితే, దీన్ని మధ్యాహ్న భోజనం లోపు తినాలి. రాత్రి భోజనం విషయానికొస్తే మొలకలు, ఉడకబెట్టిన పల్లీలు, అలసందలు తినొచ్చు. అలాగే, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ బదులు రాగిజావ తాగొచ్చు. 20 నుంచి 40 ఏండ్ల మధ్య వాళ్లు ఈ తరహా ఆహార నియమాలు పాటించవచ్చు. మధుమేహంలాంటి సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
– మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com