న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం కొనసాగుతున్న వేళ కేంద్ర సామాజిక న్యాయ శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. వ్యక్తిగత అవసరాల కోసం చాలా తక్కువ మొత్తంలో డ్రగ్స్ కలిగి ఉండటం నేరం కాదని పేర్కొన్నది. నిందితులను జైలుకు పంపనవసరం లేదని తెలిపింది. గతవారం నార్కొటిక్ చట్టం(ఎన్డీపీఎస్)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొని రెవెన్యూ విభాగానికి సిఫారసు చేసింది. అంతే కాకుండా, డ్రగ్స్ వాడేవారికి ప్రభుత్వ కేంద్రాల్లో తప్పనిసరిగా వైద్యం అందించాలని సూచించింది. ఎన్డీపీఎస్ చట్టం కింద ఇప్పటివరకు ఇలాంటి వెసులుబాటు లేదు. పరిమాణంతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి డ్రగ్స్ కలిగి ఉండటం అనేది ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ 27 కింద క్రిమినల్ నేరం. శిక్ష కింద ఏడాది జైలు/రూ.20వేల జరిమానా/రెండూ విధించవచ్చు. షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇదే సెక్షన్ కింద అరెస్టు అయ్యారు.