US Strikes | న్యూఢిల్లీ, జనవరి 16: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్ రిపబ్లిక్ చుట్టూ తన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నది. అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణించే అణు శక్తి సామర్థ్యమున్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియా వైపు పయనమైనట్లు తెలుస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్దది, అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకల్లో ఒకటైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికా నౌకాదళంలో కీలకపాత్ర పోషిస్తున్నది.
ఇరాన్ గగనతలం మూతపడిన సరిగ్గా గంట తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికన్ న్యూస్ వెబ్సైట్ నేషన్ వార్తాకథనం పేర్కొన్నది. చైనా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అక్కడి నుంచి పశ్చిమాసియా వైపు బయల్దేరినట్లు పత్రికా కథనం పేర్కొంది. అది పశ్చిమాసియాను చేరుకోవడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. అయితే అమెరికా అధికారులు మాత్రం ఈ సమాచారాన్ని ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. కాగా, వెనెజువెలాపై సైనిక దాడి జరపడానికి ముందు అమెరికా ఇదే రకమైన పంథాను ఎంచుకుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ దక్షిణ చైనా సముద్రం నుంచి సెంట్రల్ కమాండ్ ప్రాంతంలోకి పయనమైనట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వెబ్సైట్ వైట్ మౌస్ విలేకరి కెల్లీ మేయర్ వెల్లడించారు.
పశ్చిమాసియా, ఈశాన్య ఆఫ్రికా, మధ్య ఆసియా, దక్షిణాసియాలోని 21 దేశాలు సెంట్రల్ కమాండ్ ప్రాంత పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ నౌకలేవీ మోహరించి లేవు. దక్షిణ చైనా సముద్రంలో సాధారణ నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌకలో 3-6 విధ్వంసక క్షిపణులు, 1-2 జలాంతర్గాములు, 7,000-8000 మంది సైనిక సిబ్బంది, 65-70 యుద్ధ విమానాలు(ఎఫ్-35, ఎఫ్/ఏ-18) మొదలైనవి ఉన్నాయి.
మరో పక్కన పశ్చిమాసియాలోని తన సైనిక స్థావరాల నుంచి సిబ్బందిని తరలించే ప్రక్రియను అమెరికా మొదలుపెట్టింది. దాదాపు 10,000 మంది సైనిక బలగాలతో పశ్చిమాసియాలోనే అతి పెద్ద అమెరికా స్థావరమైన ఖతార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరం నుంచి కొంతమంది సిబ్బందిని బుధవారం సాయంత్రానికి తరలించివేయాలని అమెరికా ఆదేశించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. ఇది పూర్తిగా తరలింపు కాదని, బలగాల్లో మార్పులు మాత్రమేనని అమెరికా అధికారి ఒకరు వివరించారు. ఇందుకు కారణాలను వివరించనప్పటికీ ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలే కారణంగా కనిపిస్తున్నది.
అంత దూరం నుంచి అతి భారీ యుద్ధ నౌకను అమెరికా తీసుకురావడం కేవలం చిన్న దాడికి మాత్రం కాదని, అతి భారీ దాడికే అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు కనపడుతున్నదని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్ నుంచి భారీ యుద్ధనౌకను అమెరికా తరలిస్తున్నదంటే ఎక్కువ కాలం పశ్చిమాసియా ప్రాంతంలోనే మకాం వేసి నిరవధికంగా కార్యకలాపాలు కొనసాగించాలని అమెరికా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భావించాలని నిపుణులు తెలిపారు.
ఇరాన్లో నిరసనకారులను హతమారిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా ప్రభుత్వం ఇరాన్ నాయకత్వానికి పదేపదే హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా సైన్యం పశ్చిమాసియాలోని సైనిక స్థావరాలకు తన బలగాల తరలింపు చేపట్టింది. ట్రంప్ చేసిన హెచ్చరికలతో ఇరాన్లో జరగవలసి ఉన్న 800 నిరసనకారుల ఉరితీత వాయిదాపడినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారొలిన్ లీవిట్ గురువారం వెల్లడించారు.
న్యూఢిల్లీ, జనవరి 16: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఇరాన్ సూటిగా హెచ్చరిక జారీచేసింది. ఇరాన్ నాయకత్వంపై సైనిక దాడి చేస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ కూడా అంతే దీటుగా అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనల్లో మరణించిన భద్రతా సిబ్బందికి సంతాపాన్ని తెలిపేందుకు ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి ట్రంప్ ఫొటో ఉన్న ఓ ప్లకార్డును ప్రదర్శించాడు. ఆ ప్లకార్డులో గతంలో పెన్సిల్వేనియాలోని బట్లర్లో ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రస్తావిస్తూ ఈసారి గురి తప్పదు అంటూ రాసి ఉంది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్పై థామస్ క్రూక్స్గా గుర్తించిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు.