న్యూఢిల్లీ: భారత్లో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా ఉన్నట్లు ఆ దేశ దౌత్యవేత్త(US Ambassador) సెర్గియో గోర్ తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఇండియాలో పర్యటించనున్నట్లు చెప్పారు. కానీ ఎప్పుడు ఆ పర్యటన ఉంటుందో కచ్చితమైన తేదీలు తనకు తెలియదన్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇండియాలో పర్యటన చేపట్టేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓవల్ ఆఫీసులో ట్రంప్ను కలిశానని, ఇండియాకు ఎప్పుడు వెళ్దామని ఆయన అడిగారన్నారు. ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య సంబంధాలు గొప్పగా ఉన్నట్లు చెప్పారు.
ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి రిలేషన్ ఉందన్నారు. ఆ ఇద్దరూ మంచి స్నేహితులన్నారు. గతంలోనూ మంచి స్నేహితులే అని, భవిష్యత్తులోనూ ఆ స్నేహం కొనసాగుతుందన్నారు. ఇద్దరు మాట్లాడుకున్న ప్రతిసారి ఓ గొప్ప సందర్భం అవుతుందన్నారు. అమెరికా దౌత్యవేత్తగా తాను భారత్లో అడుగుపెట్టిన తర్వాత ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఇద్దరికీ విన్-విన్ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.