సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఒకే ఒక్క లేఅవుట్ ఆ ప్రాంత రూపు రేఖల్నే మార్చేస్తోంది. ఒకప్పుడు మూసీ పొడవునా గడ్డి భూములతో కమ్ముకొని ఉండే ఆ ప్రాంతమంతా ఇప్పుడు విశాలమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చిక మైదానాలు, శిల్పారామం, మెట్రోరైలు డిపో, కమాండ్ కంట్రోల్ సెంటర్, మెట్రో స్టేషన్.. ఇలా అనేక ప్రత్యేకతలకు ఆలవాలంగా మారింది. అంతేకాకుండా ఆ లే అవుట్ చుట్టూ ఇతర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఆ లేవుట్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? అదే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లే అవుట్. మూసీకి ఒకవైపు రామంతాపూర్ నుంచి మొదలుకొని ఉప్పల్ మీదుగా పీర్జాదిగూడ వరకు సుమారు 500 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన ఈ లే అవుట్ ఇప్పుడు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. ఇన్నర్ రింగ్రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఈ లేఅవుట్లో నుంచి రోడ్డు, మెట్రో మార్గాలు వెళ్లడంతో కొత్తగా స్థిర నివాసాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు పెండింగ్లో ఉన్న ఈ లేఅవుట్ను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూ.300 కోట్లకు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది.
జూలో సందడి..
జూకు సందర్శకుల తాకిడి పెరిగింది. కరోనా మందగమనం తర్వాత ఆదివారం అత్యధికంగా 21 వేల మంది నెహ్రూ జూలజికల్ పార్కును సందర్శించారు. ఓ వైపు బాలల దినోత్సవం.. మరోవైపు ఆదివారం కలిసి రావడంతో కుటుంబసభ్యులతో కలిసి నగరవాసులు జూపార్కు సందర్శనకు వచ్చారని ప్రజా సంబంధాల అధికారి హనీఫుల్లా తెలిపారు. పర్యాటకులతో రూ.16 లక్షల పై చిలుకు ఆదాయం వచ్చిందన్నారు.
లింక్ రోడ్లతో సాఫీగా రవాణా..
హెచ్ఎండీఏ నిబంధనలతో ఏర్పాటు చేసిన ఉప్పల్ భగాయత్ లే అవుట్లో 120 అడుగుల వెడల్పుతో నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించారు. మూసీకి సమాంతరంగా రామంతాపూర్లోని కేటీఆర్ నగర్ నుంచి మొదలై నాగోల్ మూసీ బ్రిడ్జి వరకు.. నాగోల్-ఉప్పల్ ఇన్నర్ రింగ్రోడ్డును దాటిన తర్వాత పీర్జాదిగూడ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు 120 అడుగుల రోడ్డును హెచ్ఎండీఏ ఏర్పాటు చేసింది. దీంతో వరంగల్ జాతీయ రహదారిపై ఉండే ట్రాఫిక్ను తగ్గించేందుకు ఈ రహదారి కీలకంగా మారింది. ఇప్పటికే ఇదే లేఅవుట్లో 80, 60 అడుగుల వెడల్పుతో ఉన్న రోడ్ల మీదుగా ఉప్పల్ నల్లచెరువు వద్ద ఏసియన్ మాల్ వరకు లింకు రోడ్డును అభివృద్ధి చేశారు. దీంతో ఎల్బీనగర్, నాగోల్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులను ఉప్పల్ చౌరస్తా వరకు రాకుండా ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లోంచే బోడుప్పల్, వరంగల్ హైవే పైకి చేరుకునేలా మళ్లిస్తున్నారు.
విశాలమైన రోడ్లతో వేగంగా అభివృద్ధి..
గత దశాబ్దకాలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒక్క లే అవుట్లో ఇంతటి అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. రామంతాపూర్ నుంచి మొదలు కొని ఉప్పల్,నాగోల్, పీర్జాదిగూడ వరకు 4-5 కి.మీ పరిధిలో ఉన్న ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని విశాలమైన రోడ్లు అభివృద్ధికి కేరాఫ్గా మారాయి. ప్రస్తుతం ఈ లేఅవుట్లో 150 వరకు పైగా అపార్టుమెంట్లు, వ్యక్తిగత ఇండ్ల నిర్మాణం జరుగుతుండగా, మరో 120కి పైగా నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్ఎండీఏనే 120,100,80,60 అడుగుల వెడల్పుతో రోడ్లను నిర్మించడంతో బహుళ అంతస్తుల నిర్మాణం ఊపందుకుంది. మరో 2 నుంచి 4 ఏండ్లలో లేఅవుట్లోని అన్ని ప్లాట్లలో ఇండ్ల నిర్మాణాలు పూర్తి అవుతాయని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. రోడ్లతో పాటు మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ, పార్కులు, అనుసంధాన రోడ్లు లాంటి మౌలిక వసతులు ఇక్కడ ఉండటంతో అనేక మంది స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు.
భవిష్యత్లో ఓఆర్ఆర్ వరకు లింక్ రోడ్డు..
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మూసీకి సమాంతరంగా 120 అడుగుల వెడల్పుతో నిర్మించిన రోడ్డును భవిష్యత్లో పీర్జాదిగూడ నుంచి మూసీ వెంబడి గౌరెల్లి వద్ద ఉన్న ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. నగరంలోని ఇన్నర్ రింగ్రోడ్డు నుంచి ఔటర్ రింగ్రోడ్డు వరకు ప్రతిపాదించిన రేడియల్ రోడ్డు తరహాలో దీన్ని విశాలంగా నిర్మించేందుకు అధికారులు భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచారు.