UPI Payments | ఆన్లైన్ లావాదేవీల్లో కొత్త రికార్డు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు (యూపీఐ) లక్ష కోట్ల డాలర్లు దాటాయి. గత రెండేండ్లలో ఇది చాలా ఎక్కువ. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. అతి తక్కువ మొత్తాల చెల్లింపులు కూడా యూపీఐ ద్వారానే చేస్తున్నారు. యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.83.45 లక్షల కోట్లని మార్చి 29న జారీ చేసిన ప్రకటనలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. ఇది ఐదేండ్లలో తొలిసారని పేర్కొంది.
మార్చిలో తొలిసారి యూపీఐ పేమెంట్స్ సిస్టమ్ కింద చెల్లింపులు 504 కోట్లకు చేరాయి. కేవలం మార్చి 29 వరకే రూ.8.8 లక్షల కోట్లకు చేరుకుంది. ఫిబ్రవరితో పోలిస్తే ఇది 7.5 శాతం ఎక్కువ. నెలవారీ లావాదేవీలు మొత్తం రూ.9 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
కరోనాతో గత రెండేండ్లుగా యూపీఐ చెల్లింపులు నూతన రికార్డులు నమోదు చేస్తున్నాయి. 2021-22 ప్రారంభంలో అంటే 2021 ఏప్రిల్లో 260 కోట్ల లావాదేవీలు జరుగగా, రూ.4.93 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఏడాది తర్వాత నెల వారీ లావాదేవీల్లో 94 శాతం, చెల్లింపుల్లో 80 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2020-21లో మొత్తం నగదు లావాదేవీల్లో యూపీఐ లావాదేవీలు 16 శాతం అయితే, 2021-22లో 60 శాతం యూపీఐ ద్వారా జరిగాయి.