UPI payments : దేశంలో ప్రస్తుతం యూపీఐ సేవల వినియోగం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు యూపీఐ సేవలన్నీ ఉచితమే. కానీ, ఇకపై ఈ విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. యూపీఐ సేవలపై స్వల్ప ఫీజు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం చట్టంలో మార్పులు తీసుకురానుంది. యూపీఐ పేమెంట్స్కు సంబంధించి అమలులో ఉన్న పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్కు పార్లమెంట్లో సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఈ సవరణ చట్టం అమలులోకి వస్తే యూపీఐ లావాదేవీలపై పరిమితమైన ఛార్జీలు విధిస్తారు. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. కొత్త చట్టం ద్వారా పేమెంట్ ఇండస్ట్రీ వర్గాల ఎప్పటినుంచో కోరుతున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేస్తారు. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం రూ.2,000 అంతకన్నా ఎక్కువ పేమెంట్స్పై 0.3 నుంచి 0.5 శాతం వరకు ఛార్జీ వసూలు చేస్తారు. అయితే, ఈ ఛార్జీని వినియోగదారుడు చెల్లించాల్సిన అవసరం లేదు. పేమెంట్ అందుకున్న వ్యాపారులు మాత్రమే ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, కొత్త చట్టం ద్వారా యూపీఐ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు, భారం పడదు. వ్యాపారులు మాత్రమే ఆ మొత్తం చెల్లించాలి. అది కూడా వార్షికాదాయం రూ.1.5 కోట్లు దాటిన వ్యాపారులే. చిన్న వ్యాపారులపై దీని ప్రభావం ఉండదు. భారీ వ్యాపారం చేసే వారిపైనే భారం పడుతుంది.
ఈ చట్టం ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ దీన్ని అమలు చేయాలనుకున్నా.. ఎలా అమలుచేయాలి, దీని చట్టబద్ధత వంటి అంశాలపై పరిశీలన జరుగుతోంది. న్యాయపరమైన అంశాల్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతే ఇది పార్లమెంట్లో సవరణకు వస్తుంది. అంతవరకు ప్రస్తుతం అమలవుతున్న విధానంలో ఏ మార్పూ లేదు. వినియోగదారులతోపాటు, వ్యాపారులు కూడా అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు.