హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావడమే విజయానికి సోపానమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ‘సృష్టి-2022’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈపీటీఆర్ఐ, సీఎంఆర్ఐటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును అధునాతన టెక్నాలజీతో నిర్మించారని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఈపీటీఆర్ఐ డీజీ వాణీప్రసాద్ మాట్లాడుతూ.. గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్, వాటర్ బడ్జెటింగ్, గ్రీన్ జీపీడీ, సోలార్, వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్స్, ఎకాలజీ, బయోడైవర్సిటీ రంగాల్లో తమ సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.