లక్నో: కుటుంబ కలహాలతో సొంత తమ్ముడితోపాటు అతని భార్యను కొట్టి చంపిన అన్న.. వారి ఏడాది వయసున్న కుమారుడి అవయవాలను కోసి కిరాతకంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని భదోహి జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని కజియానాకు చెందిన నౌషద్ మటన్ వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన తమ్ముడైన జమీల్ (42) అతని భార్య రూబీ (38)ని మటన్ కోసే కత్తితో కొట్టి చంపేశాడు. అంతటితో ఆగకుండా.. వారి ఏడాది వయస్సున్న కుమారుడి అవయవాలను కోసేశాడు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు బదోహీలోని దవాఖానకు తరలించగా వారు అప్పటికే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు.
కుటుంబ కలహాలతో తన తమ్ముడు, మరదలుని కత్తితో కొట్టి చంపేశాడని, తర్వాత వారి కుమారుని కాలు, చెయ్యి నరికేశాడని భదోహి ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. హత్య అనంతరం నౌషద్ తన తల్లితో పరారయ్యాడని చెప్పారు. అతనికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.