లక్నో, ఫిబ్రవరి 9: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమరాంగణానికి వేళయ్యింది. తొలి దశలో గురువారం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది. 2.27 కోట్ల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతాల్లో 623 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో అధికార పార్టీ బీజేపీకి చెందిన 9 మంది మంత్రులు కూడా ఉన్నారు. కొవిడ్ నిబంధనల మధ్య ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా 412 కంపెనీలకు చెందిన 50 వేల మంది కేంద్ర పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. పోలింగ్కు 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలను మూసేశారు.
యూపీ ఎన్నికలకు సంబంధించి అధికార బీజేపీ, విపక్ష ఎస్పీ-ఆరెల్డీ కూటమి మధ్య ప్రచారం నువ్వా-నేనా అనే రీతిన సాగింది. 2017లో ఈ 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53, ఎస్పీ 2, బీఎస్పీ 2, ఆరెల్డీ ఒక సీటును గెలుచుకొన్నాయి. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి గురువారం నుంచి మార్చి 7 మధ్య ఏడు విడుతల్లో పోలింగ్ జరుగనున్నది. మిగతా నాలుగు రాష్ర్టాలైన ఉత్తరాఖండ్, గోవాకు 14న, పంజాబ్కు 20న, మణిపూర్కు ఈ నెల 27, మార్చి 3న పోలింగ్ జరుగనున్నది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.
బైక్పై ముగ్గురు వెళ్తే తప్పేంటి? :రాజ్భర్
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల వేళ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్భవర్ విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. ఒక రైలులో 70 సీట్లలో 300 మంది ప్రయాణిస్తున్నప్పుడు లేని చలాన్లు, బైక్పై ముగ్గురు వెళ్తే ఎందుకు? అని ప్రశ్నించారు. ‘మా కూటమి అధికారంలోకి వస్తే అటువంటి బైకర్ల చలాన్లు రద్దు చేస్తాం, బైక్పై ముగ్గురు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతి ఇస్తాం. లేదంటే జీపులు, రైళ్లపై కూడా చలాన్లు వేస్తాం’ అని హామీ ఇచ్చేశారు. బుధవారం మీడియా సమావేశం సందర్భంగా రాజ్భర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
మోదీ పాలనలో అంతర్యుద్ధం దిశగా దేశం
ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ విమర్శించారు. యూపీలో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. యూపీలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో సమాజ్వాద్ పార్టీకి మద్దతుగా ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి మత ఘర్షణలు, ఆలయాలను బీజేపీ ఎన్నికల ప్రచార అస్ర్తాలుగా చేసుకొన్నదని మండిపడ్డారు. 70 ఏండ్ల క్రితం మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిష్ పాలకులను దేశం నుంచి తరిమేస్తే ఇప్పుడు బీజేపీ రూపంలో మళ్లీ వచ్చారని విమర్శించారు. బీజేపీతో యూపీ ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు.