లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లను రేప్ చేసి, మర్డర్ చేసిన విషయం తెలిసిందే. 17 ఏళ్లు, 15 ఏళ్ల ఆ అమ్మాయిల్ని ఓ చెట్టుకు వేలాడదీశారు. ఈ కేసులో యూపీ పోలీసులు ఆరు మంది యువకుల్ని అరెస్టు చేశారు. అందులో నలుగురు వ్యక్తులు ఆ దళిత అమ్మాయిల్ని ఉరివేసి చంపినట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన వారిలో సుహేల్, జునైద్, హఫీజుల్ రెహ్మాన్, కరీముద్దిన్, ఆరిఫ్లతో పాటు చోటూ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ఇద్దరు అమ్మాయిలకు చోటూ పరిచయస్తుడు. ఆ ఇద్దర్నీ ఆ యువకులకు అతనే పరిచయం చేశాడు.
సుహేల్, జునైద్లు ఇద్దరు అమ్మాయిల్ని చెరుకు తోటలోకి తీసుకువెళ్లినట్లు జిల్లా పోలీసు అధికారి సంజీవ్ సుమన్ తెలిపారు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతులు వత్తిడి చేయడంతో.. వాళ్ల దుపట్టాతోనే ఆ ఇద్దరికి ఉరివేసినట్లు విచారణలో తేలింది. కరీముద్దీన్, ఆరిఫ్లు ఆ ఇద్దరికీ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. రేప్, మర్డర్ చేసిన ఆ యువకులు.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను ఓ చెట్టుకు వేలాడదీశారని, ఆ ఇద్దరిదీ ఆత్మహత్య అనుకునేలా చెట్టుకు ఉరివేసినట్లు పోలీసులు తెలిపారు.
అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేయలేదని, కానీ ఇష్టపూర్వకంగానే ఆ యువకుల బైక్లపై వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సుహేల్, జునైద్లకు ఆ ఇద్దరు సిస్టర్స్ స్నేహితులని తెలుస్తోంది. అయిదుగుర్ని బుధవారమే అరెస్టు చేశారు. ఒకర్ని ఇవాళ ఉదయం ఎన్కౌంటర్లో పట్టుకున్నారు. మర్డర్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్నీ అరెస్టు చేసినట్లు పోలీసు చీఫ్ సంజీవ్ శర్మ తెలిపారు. తన కూతుళ్లు ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరిన మూడు గంటల తర్వాత శవమై తేలినట్లు తల్లి ఆరోపించింది. ముగ్గురు యువకులు బలవంతంగా బైక్పై తన కూతుళ్లను తీసుకువెళ్లినట్లు ఆమె తెలిపింది.
చెరుకు తోట వద్ద ఉన్న ఓ చెట్టుకు ఇద్దరి మృతదేహాలు వేలాడి ఉన్నాయి. చున్నీలతో ఇద్దర్నీ ఉరి తీశారు. అయితే వాళ్లకు గాయాలు అయినట్లు ఎక్కడా కనిపించడం లేదు. మృతదేహాలను పోస్టుమార్టమ్కు తరలించే సమయంలో పోలీసుల్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. 2014లో కూడా యూపీలోని బుద్వాన్లో ఇద్దరు సిస్టర్స్ను దారుణంగా ఉరి తీసిన విషయం తెలిసిందే.