సూర్యాపేట టౌన్, జనవరి 14 : రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 డైరీ, కాలెండర్ను సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే మాజిద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు విద్యుత్ కాంట్రాక్టర్లతోపాటు యావత్ రైతాంగానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. జిల్లాల వారీగా విద్యుత్ స్టోర్స్ ప్రారంభించడంతో మారుమూల ప్రాంతాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతోపాటు ఇతర పరికరాల సరఫరా సులభతరమైందన్నారు. ఈ విషయాలను విద్యుత్ కాంట్రాక్టర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
యావత్ భారతదేశంలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధినే తార్కాణం అని కొనియాడారు. తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ పేరుతో సకల సమాచారంతో డైరీ, క్యాలెండర్లు రూపొందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ లైసెన్సింగ్ బోర్డ్ డైరెక్టర్ పర్వతాలు, అసోసియేషన్ సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల అధ్యక్షులు అనంతుల వేణుగోపాల్, ఉప్పల జానకిరాంరెడ్డి, యాదగిరి, యూనియన్ నాయకులు సత్తిరెడ్డి, వహీద్, నరేందర్, సింగమలై చారి, శ్రీనివాస్గౌడ్, రమేశ్, వెంకన్న, రాంరెడ్డి, సంతోష్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.