న్యూఢిల్లీ, నవంబర్ 20: నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న నిరసనోద్యమానికి మొదటి నుంచి తన మద్దతు ప్రకటిస్తూ.. అధికార బీజేపీ సర్కారు విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న అదే పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ముందు పలు డిమాండ్లు ఉంచారు. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రధాని.. రైతులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కూడా హామీని ఇవ్వాలన్నారు. ఇది నెరవేర్చనంతవరకు రైతు ఉద్యమం ఆగబోదని స్పష్టంచేశారు. అలాగే, లఖింపూర్ ఘటనలో రైతుల మరణానికి కారణమైన కేంద్రమంత్రి అజయ్మిశ్రాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. ఈ మేరకు శనివారం మోదీకి పలు డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖ రాశారు.
రూ. కోటి పరిహారం ఇవ్వాలి
సాగుచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నానని వరుణ్గాంధీ లేఖలో పేర్కొన్నారు. అయితే, చట్టబద్ధమైన ఎంఎస్పీని ప్రకటించడంతో పాటు సాగు చట్టాల రద్దు ప్రక్రియను పార్లమెంటులో పూర్తిచేసేంతవరకూ రైతులు ఆందోళనలను విరమించబోరని తెలిపారు. ఎంఎస్పీపై రైతుల్లో ఆగ్రహావేశాలు నెలకొన్నాయని, అవి మరో రూపంలోకి మారే ప్రమాదమున్నదన్నారు. సన్నకారు రైతులకు ఆర్థిక భరోసాను కల్పించే ఎంఎస్పీపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. జాతి ప్రయోజనాలకు ఇది ఎంతో కీలకమన్నారు. ఆందోళనలో మరణించిన రైతులపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ‘సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన మోదీకి ధన్యవాదాలు. అయితే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిపాటు చలిలో నిరసనలు చేస్తూ 700 మందికి పైగా రైతు సోదర, సోదరీమణులు తనువు చాలించారు. చట్టాల రద్దు నిర్ణయాన్ని ముందే తీసుకొని ఉంటే, ఇంత మంది అమాయకులు బలయ్యేవారు కాదు కదా!’ అని ప్రధానిని సూటిగా ప్రశ్నించారు. ఆందోళనలు చేస్తూ అమరులైన రైతు సోదరుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే, నిరసనకారులపై నమోదుచేసిన తప్పుడు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలన్నారు.
ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ హింసాత్మక ఘటన ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా అభివర్ణించిన వరుణ్ గాంధీ.. ఈ ఘటనకు కారణమైన కేంద్రమంత్రి (అజయ్మిశ్రా)పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే కేసు దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కొందరు సీనియర్ నేతలు రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే హింసాత్మక ఘటనలు తలెత్తాయని పేర్కొన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాల్లో సిరా తప్ప నలుపేముంది?: వీకే సింగ్
బస్తీ, నవంబర్ 20: కొత్త వ్యవసాయ చట్టాల్లో వాటిని రాయడానికి వాడిన ఇంక్ (సిరా) తప్ప నలుపు ఏముందని కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ వ్యాఖ్యానించారు. రైతు సంఘాల్లో ఆధిపత్య పోరు ఉందని, అవి చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. వ్యవసాయ రంగానికి కీడు చేసే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా నిరసనోద్యమం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించి, దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. మరుసటి రోజే వీకే సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.