ముంబై : మన్సుఖ్ హిరన్ హత్య కేసు, అంటిలియా భయోత్పాతం కేసులో ముంబై పోలీస్ అధికారి సచిన్ వజే అరెస్ట్ నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రి రాందాస్ అథవలే డిమాండ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్లో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇల్లు అంటీలియా వెలుపల బాంబు కలకలం ఘటనలో పోలీస్ అధికారి సచిన్ వజే పాత్ర ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర దాగుందని వెల్లడిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
దేశంలో బడా పారిశ్రామికవేత్త అంబానీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని, ఆయన ఇంటి ముందు పేలుడు పదార్ధాలు ఉంచడం వంటి భారీ కుట్ర వెనుక వాస్తవంగా ఎవరున్నారనేది నిగ్గుతేల్చాలని అథవలే డిమాండ్ చేశారు. సచిన్ వజేను ప్రేరేపిస్తున్న పెద్దమనుషులు ఎవరనేది గుర్తించాలని అన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు.