చిక్కడపల్లి, నవంబర్ 5: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడో నిరుద్యోగి. అసలు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చింది? ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది? అధికారంలోకి రాగానే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం.. ఆ హామీని నెరవేర్చిందా? అని సంజయ్ను నిలదీశాడు. యువకుడి ప్రశ్నలకు షాక్ తిన్న సంజయ్.. ఏం జవాబివ్వాలో అర్థంకాక నీళ్లు నమలాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే.. ఈ నెల 16న నిర్వహించనున్న నిరుద్యోగుల మిలియన్ మార్చ్లో భాగంగా శుక్రవారం సాయంత్రం బండి సంజయ్ అశోక్నగర్లోని కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగులను విస్మరిస్తున్నదని గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థులను రెచ్చగొట్టే యత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న నిరుద్యోగి సురేశ్.. బండి సంజయ్ను నిలువరించారు. 2014 ఎన్నికల హామీల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక బండి సంజయ్ నీళ్లు నమిలారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాలు ఇవ్వలేని కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించే ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని సురేశ్ తూర్పారబట్టారు. ఈ పరిణామానికి బండి సంజయ్ బిత్తరపోవటంతో బీజేపీ నేతలు, పోలీసులు సురేశ్ను పక్కకు తీసుకెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు.