హుజురాబాద్ : మొఖం మొగులుకు పెట్టి చూసే బాధలు లేకుండా.. రైతులకు కండ్ల నిండా కరెంటు, కాల్వ నిండుగా సాగునీటిని అందిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తూ సీఎం కేసీఆర్ ను దీవించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, కందుగుల, పెద్దపాపయ్య పల్లి, చిన్న పాపయ్య పల్లి తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు.
హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఆయనతో కలసి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్న ప్రభుత్వమని, 24 గంటల కరెంట్, కాళేశ్వరం జలాలు, రైతు బంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు.
18 రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాలు అమలు చేయడం లేదని.. అలాంటి పార్టీకి ఎలా ఓటేద్దామని ప్రశ్నించారు. రూ.50 వేల ఋణాలు మాఫీ చేశామని, లక్ష రూపాయల రుణ మాఫీ కూడా వడ్డీ తో సహా త్వరలోనే మాఫీ అవుతాయని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టాలని ఆదేశాలు ఇచ్చిందని, దీన్ని ఏపీ లో అమలు చేసే యోచనలో ఉన్నారని, కానీ తెలంగాణ లో మాత్రం సీఎం కేసీఆర్ ప్రాణం పోయినా కానీ తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్ట నివ్వం అని అంటున్నారని అయన వివరించారు.
రైతులను వంచిస్తున్న బీజేపీ కావాలా? రైతుల కోసం పని చేస్తున్న టిఆర్ఎస్ కావాలో? ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో ఈటల గెలిస్తే.. ఆయనకు మాత్రమే లాభమని, కానీ టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలందరికీ లాభం జరిగి తీరుతుందని అయన స్పష్టం చేశారు.