OPT Work Visa | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులలో అనిశ్చితి నెలకొంటోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను రద్దు చేయాలని కోరుతూ అమెరికన్ కాంగ్రెస్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి అమెరికాలో చదువుకుంటున్న భారతీయుల సంఖ్య 28 శాతం క్షీణించింది. అంతర్జాతీయ విద్యార్థులు ప్రత్యేకంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్(స్టెమ్) కోర్సుల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగాన్వేషణ కోసం మూడేళ్లపాటు అమెరికాలో నివసించేందుకు ఓపీటీ ప్రోగ్రామ్ అనుమతిస్తుంది. అయితే ఓపీటీని రద్దు చేయాలని కోరుతూ ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్ యాక్ట్ 2025 పేరిట కొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
గత ఏడాది జూలై నుంచి క్రమంగా భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నట్టు స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవీస్) డాటా సూచిస్తోంది. 2024 జూలైలో 3,48,446 మంది భారతీయులు అమెరికాలో విద్యనభ్యసిస్తుండగా 2024 ఆగస్టు నాటికి ఈ సంఖ్య 2,55,447కి తగ్గింది. ఈ ఏడాది మార్చి వరకు ఈ సంఖ్య 2.55 లక్షలుగా కొనసాగింది. గత ఏడాది వరకు భారతీయ విద్యార్థుల నమోదు క్రమంగా పెరుగుతూ పోగా ఇప్పుడది తగ్గుతూ వస్తోంది. 2025 విద్యా సంవత్సరానికి భారతీయ విద్యార్థుల నమోదు 28 శాతం తగ్గడానికి వీసా జారీలో అనిశ్చితి, ప్రతిపాదిత ఓపీటీ ప్రోగ్రామ్ రద్దు, ట్యూషన్ ఖర్చుల పెరుగుదల వంటివి కారణాలని స్టెప్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధార్థ్ అయ్యర్ తెలిపారు.
2023-24 విద్యా సంవత్సంలో 97,556 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీ ప్రోగ్రామ్లో పాల్గొన్నారని ఆయన వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో అది రద్దయిన పక్షంలో ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక స్థిరత్వంపై విద్యార్థులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఆయన తెలిపారు. రూపాయి విలువ తగ్గుదలతో విద్యార్థులకు ఖర్చులు పెరిగిపోయాయని, అమెరికాలో చదువు ఖర్చులు సంవత్సరానికి 25,000 డాలర్ల నుంచి 45,000 డాలర్ల వరకు ఉంటాయని, దీంతో భారతీయ కుటుంబాలు అమెరికన్ చదువులను భరించలేని పరిస్థితి తలెత్తిందని సిద్ధార్థ్ అయ్యర్ పేర్కొన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలపై న్యాయ పోరాటం ప్రారంభమైంది. ప్రొఫెసర్లు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు దీనిలో భాగస్వాములయ్యాయి. విద్యార్థుల వీసాల రద్దు, అరెస్టులు చేయడం, కొన్ని విద్యా సంస్థలను డీసర్టిఫై చేస్తామని బెదిరించడం వంటి చర్యల వల్ల అమెరికన్ విశ్వవిద్యాలయాలు, కళాశాలల పట్ల భయానక వాతావరణం ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశాయి.
అమెరికన్ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల సంఘం దాఖలు చేసిన ఈ దావాకు ప్రెసిడెంట్స్ అలయెన్స్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్, 86 సంఘాలు, విద్యా సంస్థలు మద్దతు పలికాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలను కొనసాగనివ్వరాదని అన్నారు. అమెరికన్ ఆర్థిక, విద్యా వ్యవస్థలను ట్రంప్ విధానాలు సర్వనాశనం చేస్తున్నాయని ప్రెసిడెంట్స్ అలయెన్స్ వాదించింది.