తిరుపతిలోని రుయా అంబులెన్స్ మాఫియా సంఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సీఎస్ఆర్ ఎంవో సరస్వతి దేవిపై వేటు వేసింది. అలాగే సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. అంబులెన్స్ను అడ్డుకున్న నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది.
ఇలా.. అంబులెన్స్ మాఫియా నీచంగా వ్యవహరించడంతో అంబులెన్స్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో డీఎస్పీ, ఆర్డీవో, డీఎంహెచ్వోతో ఓ ప్రత్యేక కమిటీని నియమించింది.
ఏం జరిగిందంటే…
అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి ఆరోగ్యం బాగో లేదని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీ, కాలేయానికి సంబంధించిన చికిత్సను వైద్యులు అందిస్తున్నారు. వైద్యం అందిస్తుండగానే ఆ బాలుడు మరణించాడు. ఈ బాలుడిని తిరుపతి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో వున్న చిట్వెల్లికి తీసుకెళ్లానని ఆ బాలుడి తండ్రి రుయా ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లను అడిగాడు.
అందుకు 10 వేలు అవుతుందని డ్రైవర్లు చెప్పారు. తన దగ్గర అంత డబ్బు లేదని జవాబిచ్చారు. కుదరదని డ్రైవర్లు బదులిచ్చారు. దీంతో ఆ తండ్రి ఉచిత అంబులెన్స్కు ఫోన్ చేస్తే.. ఆ బాలుడి మృత దేహాన్ని తీసుకెళ్లడానికి ఆస్పత్రికి వచ్చింది. అంతే… రుయా ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లు ఆ ఉచిత అంబులెన్స్ డ్రైవర్ని కొట్టి పంపించారు. తమ అంబులెన్స్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి డ్రైవర్లు డిమాండ్లు చేశారు. చివరికి ఆ తండ్రి తన కుమారుడి మృత దేహాన్ని ద్విచక్రవాహనంపైనే తీసుకెళ్లాడు.