హైదరాబాద్, జనవరి 18: శ్రీశైలానికి ఉత్తరద్వారంగా ప్రసిద్ధి చెందిన నాగర్కర్నూల్ జిల్లాలోని ఉమామహేశ్వర దేవాలయ సమీపంలోని రోడ్డు వెంట ఉన్న వీరభద్ర, నంది విగ్రహాలకు చారిత్రక ప్రాధాన్యం ఉన్నదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. వీటిని పీఠాలపై నిలబెట్టి భద్రపరచాలని స్థానికులకు సూచించారు. మంగళవారం ఆయన ఈ విగ్రహాలను పరిశీలించారు. శానపురాతితో అద్భుత శిల్పకళ ఉట్టిపడేట్టుగా చెక్కిన వీరభద్రుని విగ్రహాన్ని పోలిన మరో విగ్రహం నల్లగొండ జిల్లా దేవరచర్చలో ఉన్నదని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తనతో చెప్పారని పేర్కొన్నారు. ఉమామహేశ్వర దేవాలయంలోని పార్వతి, చెన్నకేశవ, మహిషాసురమర్ధిని, వీరభద్ర, నంది విగ్రహాలను చిన్న శరభయ్య, పెద్ద శరభయ్య అనే శిల్పులు చెక్కినట్టుగా క్రీ.శ 1320 నాటి కాకతీయ ప్రతాపరుద్రుని శాసనంతోపాటు క్రీ.శ 14వ శతాబ్దినాటి మరో శాసనంలో ఉన్నదని వివరించారు. ఈ శాసనాల ప్రకారం వీటిని ఆలయంలో సదానందస్వామి ప్రతిష్ఠించారని పేర్కొన్నారు. ఈ విగ్రహాల్లో కొన్ని ఆలయంలో భద్రంగా ఉన్నప్పటికీ, ముళ్లపొదల్లో ఉన్న వీరభద్ర, నంది విగ్రహాలు కూడా ఆ శాసనంలో ప్రస్తావించినవేనని చెప్పారు. వీటికి సమీపంలోనే రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన మాదా నాయకుడి క్రీ.శ 1377 సంవత్సరం నాటి శాసనం కూడా ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. వీటిని పరిరక్షించుకోవాలని స్థానికులకు, పూజారులకు, అధికారులకు సూచించారు.