కీవ్: చంకలో చంటిపాపలు, చేతిలో సామాన్లు పట్టుకుని గడ్డకట్టే చలిలో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. దేశం కాని దేశంలో తమను అక్కున చేర్చుకోవాలంటూ ప్రాధేయ పడుతున్నారు. పొరుగు దేశాల సరిహద్దుల్లోకి వెళ్లి బుక్కెడు బువ్వ కోసం చేతులు చాస్తున్నారు. సొంత దేశంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆశయాలు, మరెన్నో కోరికలు, ఇంకెన్నో సరదాలు, జ్ఞాపకాలు.. అవన్నీ ఒక్కరోజులో పటాపంచలయ్యాయి. కళ్ల ముందే కలలన్నీ ఆవిరయ్యాయి. అమ్మకు కొడుకు లేడు. నాన్నకు బిడ్డ లేదు. భర్తకు భార్య లేదు. చెట్టుకొకరు.. పుట్టకొకరు. జీవితాలన్నీ చెల్లాచెదురు. గ వారంతా దేశాన్ని కాపాడుకునేందుకు కదన రంగంలోకి దిగితే.. బిడ్డలను కాపాడుకునేందుకు మహిళలంతా దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. ఇదీ ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిస్థితి రెండు రోజుల్లో 2 లక్షల మంది రెండు రోజుల్లోనే దాదాపు రెండు లక్షలకు పైగా ఉక్రెయిన్ ప్రజలు సరిహద్దు దేశాలకు వలస వెళ్లారు. వలసలు ఇలాగే కొనసాగితే శరణార్థుల సంఖ్య 50 లక్షలు దాటవచ్చని ఐక్యరాజ్య సమితి (యూఎన్వో) అంచనా వేసింది. ఆరు నెలల్లో వలస సంక్షోభం ముంచుకొస్తుందని హెచ్చరించింది. ఉక్రెయిన్ నుంచి తరలివెళ్లిపోతున్న వారిని సరిహద్దు దేశాలు పోలాండ్, రొమేనియా, స్లొవేకియా, చెక్ రిపబ్లిక్ దేశాలు అక్కున చేర్చుకొంటున్నాయి. 10 లక్షల మందికి ఆశ్రయం ఇస్తామని పోలాండ్ ప్రకటించింది. వారు నివాసం ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. శరణార్థులకు సహాయకచర్యలు చేపట్టేందుకు అమెరికా ఇప్పటికే పోలాండ్కు 3 వేల మంది సైనికులను పంపింది.
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఉక్రెయిన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని ఈ తీర్మానం డిమాండ్ చేసింది. దీనిపై శుక్రవారం జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉండటం గమనార్హం. తీర్మానాన్ని అమెరికా, అల్బేనియా ప్రతిపాదించగా.. పొలాండ్, ఇటలీ, జర్మనీతో పాటు 11 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. భారత్తో పాటు చైనా, యూఏఈ ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ఐరాసలో భారత రాయబారిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి ఓటింగ్పై వివరణ(ఈఓవీ) ఇచ్చారు. ‘ఇరుదేశాలు దౌత్య మార్గాన్ని వదులుకోవడం విచారకరం. సంక్షోభ పరిష్కారానికి దౌత్యాన్ని ఎంచుకోవాలి. దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను మేం గౌరవిస్తాం’ అని పేర్కొన్నారు. హింస, శత్రుత్వాన్ని విరమించుకోవాలని సంబంధిత పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కారణాలతో తాము ఓటింగ్కు దూరంగా ఉన్నామని చెప్పారు. అయితే యూఎన్ఎస్సీలో తమకున్న వీటో అధికారంతో రష్యా ఈ తీర్మానాన్ని అడ్డుకున్నది. కాగా, ఓటింగ్కు భారత్ దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. స్నేహితుడు తప్పు చేస్తే.. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నదని ఆ పార్టీ నేత మనీష్ తివారీ పేర్కొన్నారు.