ముంబై: తుఫాను పర్యటనలపై మహారాష్ట్రలో పాలక శివసేన, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉన్నది. కొంకణ్ ప్రాంతంలో తౌక్టే తుఫాను నష్టం పరిశీలనకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేవలం కొన్ని గంటలే కేటాయించారని బీజేపీ చేసిన విమర్శలను ఆయన గట్టిగా తిప్పికొట్టారు. నా పర్యటన మూడు నాలుగు గంటలే అయితేనేమి.. నేను కనీసం భూమి మీదే ఉన్నాను. హెలికాప్టర్లో చక్కర్లు కొట్టి ఫొటోలు తీయించుకోలేదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ తుఫాను పర్యటనను ఉద్దేశించి ఆయన ఈ విమర్శలు చేశారనేది స్పష్టమే. పైగా తాను విపక్షాల విమర్శలు తిప్పి కొట్టేందుకు ఇక్కడికి రాలేదని కూడా అన్నారు. గుజరాత్ వద్ద తీరం దాటిన తౌక్టే తుఫాను గోవా, మహారాష్ట్ర, కర్నాటకలను కూడా అతలాకుతలం చేసింది. కానీ ప్రధాని ఆ రాష్ట్రాలకు వెళ్లకుండా తన పర్యటనను కేవలం సొంత రాష్ట్రమైన గుజరాత్కు పరిమితం చేయడంపై విమర్శలు వచ్చాయి.