హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ద్విచక్ర వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. రాష్ట్రంలో 55.3% కుటుంబాలు ద్విచక్ర వాహనాలను కలిగి ఉన్నాయి. దీంతో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. గోవాలో 86.7% కుటుంబాలు ద్విచక్ర వాహనాలను కలిగి ఉండటంతో ఆ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) వెల్లడించింది. ద్వితీయ స్థానంలో పంజాబ్ (75.6%), తృతీయ స్థానంలో రాజస్థాన్ (66.4%) ఉన్నట్టు తెలిపింది. ఈ సర్వే ప్రకారం 2018 నాటికి దేశవ్యాప్తంగా 37.3% కుటుంబాలు ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉండగా.. 2021 నాటికి ఆ సంఖ్య 49.7 శాతానికి పెరిగింది.