జగిత్యాల : గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కొవిడ్-19 యూకే స్ట్రెయిన్ పాజిటివ్గా తేలింది. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వ్యక్తి అదేవిధంగా కోరుట్ల మండలం వెంకటాపూర్కు చెందిన మరో వ్యక్తి ఇరువురు ఫిబ్రవరి 25వ తేదీన నగరంలోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. విమానాశ్రయంలో కొవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా తేలడంతో హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు.
తదుపరి పరీక్షలు నిర్వహించగా వీరిరువురు యూకే స్ట్రెయిన్ భారిన పడ్డట్లు జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ఉన్నతాధికారులు తెలిపారు. తక్షణమే వీరిని హైదరాబాద్కు తరలించాల్సిందిగా ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇద్దరిని నగరంలోని గచ్చిబౌలిలో గల టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరు దుబాయ్లో విమానం ఎక్కేప్పుడు కొవిడ్ నెగిటీవ్ ఉండగా శంషాబాద్లో దిగే సరికి పాజిటివ్గా తేలింది. బహుశా యూకే గుండా ప్రయాణమే వీరు స్ట్రెయిన్ వైరస్ భారిన పడేందుకు కారణమై ఉండొచ్చన్నారు.
అధికారులు ఓ వ్యక్తికి సంబంధించిన 15 మంది కుటుంబ సభ్యులకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా వీరిలో ఆరుగురికి పాజిటివ్గా తేలింది. శాంపిల్స్ను తదుపరి ఆర్టీపీసీఆర్ పరీక్షకు పంపించారు. మరో వ్యక్తి కుటుంబ సభ్యులు నలుగురికి పరీక్షలు నిర్వహించగా నెగిటీవ్గా తేలింది. వీరి శాంపిల్స్ను ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు పంపించారు.