ఉడిపి: కర్నాటకలో హిజాబ్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. హిజాబ్ కేసులో పిటిషన్ వేసిన అమ్మాయిల్లో ఇద్దరికి ఇవాళ చేదు అనుభవం ఎదురైంది. 12వ తరగతి పరీక్షలు రాసేందుకు బుర్ఖా దుస్తుల్లో వెళ్లిన ఇద్దరు అమ్మాయిలను అధికారులు వెనక్కి పంపించారు. ఉడిపిలోని విద్యోదయ పీయూ కాలేజీలో ఈ ఘటన జరిగింది. హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రానికి వెళ్లిన ఆలియా అసది, రేష్మాలకు ఆ కాలేజీ అనుమతి కల్పించలేదు. సుమారు 45 నిమిషాల పాటు ఆ అమ్మాయిలు ఇన్విజిలేటర్లు, ప్రిన్సిపాల్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అనుమతి దక్కకపోవడంతో ఆ అమ్మాయిలు మౌనంగా కాలేజీ నుంచి వెళ్లిపోయారు. హిజాబ్ ధారణతో వచ్చే విద్యార్థులను పరీక్షలకు అనుమతించమని ఆ రాష్ట్ర మంత్రి బీసీ నగేశ్ చెప్పిన విషయం తెలిసిందే.