Twitter | ప్రశ్నిస్తే.. పని పడతా..! విమర్శిస్తే.. మూసేయిస్తా..!! ప్రతిపక్ష పార్టీలైనా.. హక్కుల కార్యకర్తలైనా.. ప్రపంచ స్థాయి మీడియా సంస్థలైనా.. సోషల్ మీడియా వేదికలైనా.. బీజేపీ సర్కారు తీరిదే! బీబీసీపై ఇటీవల వేధింపులకు దిగిన మోదీ సర్కారు.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను కూడా విడిచిపెట్టలేదు. రైతుల ఆందోళన సమయంలో బీజేపీ ప్రభుత్వం బెదిరింపులకు దిగిందని ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే సంచలన విషయాలు వెల్లడించారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు సాగించిన నిరసనోద్యమం సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి తమకు ఎన్నో ఒత్తిళ్లు వచ్చేవని ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ‘ఏ ప్రభుత్వం నుంచైనా మీకు ఒత్తిళ్లు ఎదురయ్యాయా?’ అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి డోర్సే స్పందిస్తూ.. భారత్లోని మోదీ సర్కారును ఉదహరించారు. ‘సాగు చట్టాలపై రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలో పలువురు జర్నలిస్టులు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అయితే, సర్కారుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన పోస్టులను తొలగించాలంటూ ప్రభుత్వం నుంచి చాలా అభ్యర్థనలు వచ్చేవి. భారత్ ప్రజాస్వామ్య దేశమని చెప్తూనే.. తమ అభ్యర్థనలను అంగీకరించకపోతే, భారత్లో ట్విట్టర్ను మూసేయిస్తామని బెదిరించేవారు. అలాగే, ట్విట్టర్ ఉద్యోగుల ఇండ్లల్లో తనిఖీలు చేయిస్తామని హెచ్చరించారు’ అని డోర్సే వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్న సంస్థలపై మోదీ సర్కారు బెదిరింపులకు దిగడాన్ని విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఖండించాయి. కాగా, డోర్సే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. డోర్సే చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధ్దాలేనని కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020 ఆగస్టు నుంచి ఏడాదిన్నరపాటు ఢిల్లీ సరిహద్దుల్లో వందలాది మంది రైతులు నిరసనోద్యమం సాగించారు. చలికి తట్టుకోలేక పలువురు మృతి చెందారు. దీంతో పలువురు జర్నలిస్టులు, మేధావులు కేంద్రం ఏకపక్ష ధోరణిపై మండిపడుతూ ట్విట్టర్లో పలు పోస్టులు పెట్టారు. అయితే, తప్పుడు ప్రచారం వ్యాపిస్తున్నదన్న సాకుతో 1,180 ఖాతాలను నిలిపివేయాలని, పోస్టులు పెట్టిన వారి సమాచారం ఇవ్వాలని కేంద్రం ట్విట్టర్ను ఆదేశించింది. అయితే, కొన్ని ఖాతాలను నిలిపేసిన ట్విట్టర్.. జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఖాతాలను కొనసాగించింది. ఖాతాదారుల సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కేంద్రం, ట్విట్టర్ మధ్య కొంత కాలం వివాదం కొనసాగింది.
2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై ఇటీవల డాక్యుమెంటరీ ప్రసారం చేసిన అంతర్జాతీయ దిగ్గజ వార్తా సంస్థ బీబీసీపై కూడా కేంద్రం ఇదే రీతిన కక్ష సాధింపులకు దిగింది. గత ఫిబ్రవరిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దేశంలో డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కాగా, గత నెలలో మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే.. ఆ దేశ పార్లమెంట్లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారమవ్వడం గమనార్హం.