సంగారెడ్డి అర్బన్, డిసెంబర్ 4 : వచ్చే మార్చి నెల వరకు రూ.2500 కోట్ల టర్నోవరే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం సంగారెడ్డిలోని డీసీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రూ.1.716 కోట్ల బ్యాంకు టర్నోవర్ను మార్చి వరకు రూ.2500 లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. రైతుల పిల్లల విదేశీ విద్యకు రూ.25 లక్షల రుణం అందించనున్నట్లు తెలిపారు. 22వ స్థానంలో ఉన్న బ్యాంకును 3వ స్థానంలోకి తీసుకువచ్చామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో డిపాజిట్దారులు పెరిగితే రైతాంగానికి ఇంకా మేలు జరుగుతుందన్నారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని, అవసరం ఉన్నవారికి గోల్డ్ లోన్లు ఇస్తామన్నారు. రెండెకరాల భూమి ఉన్న ప్రతి రైతుకు రూరల్ పరిధిలో రూ.10లక్షలు, పట్టణ పరిధిలో రూ. 20లక్షల వరకు హౌసింగ్ రుణాలు మంజూరు చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ.60 కోట్ల రుణాలు ఇచ్చామని, దీన్ని రూ.100 కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వయం కృషి రుణాలను చిన్న వ్యాపారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలన్నారు. అనంతరం ఉత్తమ డీసీసీబీ చైర్మన్గా జాతీయ స్థాయి అవార్డు అందుకున్న దేవేందర్రెడ్డిని టీఆర్ఎస్ నాయకుడు కృష్ణ సన్మానించారు. సమావేశంలో డీసీసీబీ బ్యాంకు సీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.