న్యూఢిల్లీ, మార్చి 25: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం.. ఎనర్జీ, మెటల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై పడుతుందని కమోడిటీ మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా సమీప కాలంలో గోధుమలు, సోయాబీన్, కార్న్ వంటి ఆహారోత్పత్తుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నదని, గడిచిన నెల రోజుల్లో ప్రధాన వస్తూత్పత్తుల ధర 8 శాతం నుంచి 21 శాతం మేర పెరిగిందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అనుబంధ సంస్థ ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొన్నది. మరోవైపు లండన్ మెటల్ ఎక్సేంజ్ ఇండెక్స్ దాదాపు 9 శాతం, ఎస్అండ్పీ జీఎస్సీఐ ఇండెక్స్ 20 శాతానికిపైగా ఎగిశాయి.
అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లోనూ యుద్ధం ప్రకంపనల్ని సృష్టిస్తున్నది. ఎనర్జీ మార్కెట్లో రష్యా రెండో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఉన్నది. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ ప్లస్ కూటమిలో రష్యా కూడా భాగమవడంతో మిగతా చమురు ఉత్పాదక దేశాలు ఈ సంక్షోభ పరిస్థితిలో తమ ఉత్పత్తిని పెంచలేకపోతున్నాయి. దీంతో రష్యా లోటు పూడ్చలేనిదిగా మారుతున్నది. డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేక ధరలూ పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటిన విషయం తెలిసిందే. ఫలితంగా అన్నింటి ధరలు సహజంగానే పెరిగిపోతున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తున్నది. ఇక నికెల్, అల్యూమినియం ఉత్పత్తినీ యుద్ధం దెబ్బతీస్తున్నది. ముఖ్యంగా అల్యూమినియం ఉత్పత్తిలో రష్యాది రెండో స్థానం. దీంతో ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రేట్లూ మండిపోయే వీలున్నదంటున్నారు.