ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 17: భువనగిరి(Bhuvanagiri) గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్(Food poisoning) జరిగి దళిత విద్యార్థి ప్రశాంత్ (Gurukula student Prashant)మరణించడం నిజంగా యావత్ తెలంగాణ ప్రజలు సిగ్గుపడాల్సిన విషయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో గురుకుల పాఠశాల విద్యార్థులు వారానికి ఒక్కొక్కరుగా మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక వైపు ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్, పాము కాట్లు వంటవి కారణాలు చెబుతున్నప్పటికీ, ఇవి పూర్తిగా ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించకపోవడమే విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్రవీడి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.