శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన కుమారస్వామి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు. అలాగే బయలు సాయంత్రం బయలు వీరభద్రుడికి ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడైన వీరభద్రుడికి ఉదక అభిషేకం, విశేష పుష్పార్చన నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగల బసవన్నకు ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సభిక్షంగా ఉంగడాలని వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించి అభిషేకానంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం, వృషభసూక్తం పఠించారు. బసవన్నకు నూతన వస్ర్తాన్ని సమర్పించి, నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పించారు.
మూలానక్షత్రం సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి ఊయలసేవ, పల్లకీసేవను వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలతో ప్రాకారాన్ని అందంగా అలంకరించారు. సాయంత్రం ఆలయ ఉప ప్రధాన అర్చకుడు మంకాల సుబ్రహ్మణ్య శర్మ స్వామి, అమ్మవార్లను ఊయలలో ప్రతిష్టించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవలో భాగంగా ఆలయంలో ప్రదక్షిణలు చేశారు.