తిరుమల, జూన్ 9: ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ రామాయణంలోని యుద్ధకాండను జూన్ 11వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో పారాయణం నిర్వహించనున్నట్లు టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. వసంత మండపంలో యుద్ధకాండ పారాయణంపై బుధవారం అదనపు ఈవో అధికారులు, పండితులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం ఏ.వి.ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మరిని నిర్ములించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి అనేక వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ ఏడాది మే 3 నుంచి 18వ తేదీ వరకు షోడశదిన సుందరకాండ దీక్ష, మే 9వ తేదీ నుంచి నక్షత్రసత్ర మహాయాగం నిర్వహిస్తోన్నారన్నారు. అదేవిధంగా మే 31న 16 గంటల పాటు ఏక దిన అఖండ సుదరకాండ పారాయణం జరిగిందన్నారు. యుద్ధకాండ పారాయణం 30 రోజుల పాటు 16 మంది వేద పండితులు వసంత మండపంలో పారాయణం, ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 30 రోజుల పాటు జప -తర్పణ-హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు.