తిరుమల : తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ (TTD) అధికారులు కీలక సూచన చేశారు. ఇప్పటి వరకు తిరుమల, ఎగువ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా స్థానికులు (Local People), యాత్రికులు (Pilgrims) పొదుపుగా నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల (Tirumala) లోని ఐదు ప్రధాన డ్యామ్లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు.
తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారని, ఇందులో 18 లక్షల గాలన్లు తిరుమల డ్యామ్ల నుంచి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్(Kalyani Dam) నుంచి సేకరించబడుతుందని తెలిపారు. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉందని వెల్లడించారు.
అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను, నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులకు , భక్తులకు సూచించారు.