ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం లాంఛనమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండలో నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుంటే బీజేపీ నాయకులు రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. లోక్సభలో బుధవారం ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందని, ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వంతో కొనుగోలు చేయించాలని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
దేవరకొండ, డిసెంబర్ 1 : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక తమకు లాంఛనమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దేవరకొండలోని విష్ణు ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డి గెలుపు ఖాయమైందన్నారు. ఈ ఎన్నిక ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టులా ఉండాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. రైతులతో బీజేపీ దొంగాట ఆడుతున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఉన్నారని అది అమాయకం అనుకుంటే వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. యావత్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 6,600కేంద్రాలతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మనకంటే ఆరు రెట్లు పెద్దదిగా ఉన్న ఉత్తరప్రదేశ్, ఐదు రేట్లు పెద్దదైన మధ్యప్రదేశ్ ఆ తర్వాత స్థానంలో ఉన్న కర్ణాటక రాష్ర్టాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నల్లగొండ జిల్లా రైతాంగం బీజేపీ నేతలను తరిమికొట్టిందని గుర్తు చేశారు. ముమ్మాటికీ వారివి క్షుద్ర రాజకీయాలని వాటిని ఎండగట్టేందుకు గులాబీ దండు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. లోక్సభలో ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ధాన్యం కొనుగొలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వ్యవసాయ రంగంపై రైతాంగానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దొంగే దొంగ అన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజాప్రతినిధులను కోరారు. శాసనమండలిలో స్థానిక సంస్థల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ డిండి ఎత్తిపోతలతో నియోజకవర్గంలో 1.16లక్ష ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. సాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన రైతులకు సాగునీరు అందివ్వాలని ఐదు లిఫ్టులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, ఎంపీపీలు మాధవరం సునీతాజనార్దన్రావు, నల్లగాసు జాన్యాదవ్, వంగాల ప్రతాప్రెడ్డి, పద్మాహన్మానాయక్, జడ్పీటీసీలు మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, మాధవరం దేవేందర్రావు, కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, పసునూరి సరస్వతమ్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్వెంకటేశ్గౌడ్, కంకణాల వెంకట్రెడ్డి, మారుపాకుల సురేశ్గౌడ్, పున్న వెంకటేశ్వర్లు, టీవీఎన్రెడ్డి, కౌన్సిలర్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
నోముల, రామ్మూర్తి యాదవ్ ప్రజా గొంతుకలు
నిడమనూరు, డిసెంబర్ 1 : దివంగత, మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ ప్రజా గొంతుకలు, అణగారిన వర్గాలకు స్ఫూర్తి ప్రదాతలు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ విగ్రహాలను మంత్రి బుధవారం డ్రోన్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నోముల నర్సింహయ్య ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తి బడుగుల గొంతుకగా నిలిచారన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి టీఆర్ఎస్ తోనే మొదలైందని గుర్తు చేశారు. 1994 ఎన్నికల్లో రామ్మూర్తి యాదవ్, 2018లో నోముల నర్సింహయ్య గెలిచి చరిత్ర సృష్టించి నేటికీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం గొప్ప విషయమన్నారు. అటువంటి నాయకుల చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్ కుమార్, నల్లమోతు భాస్కర్రావు, రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, జిల్లా నాయకులు కట్టెబోయిన గుర్వయ్య యాదవ్, మన్నెం రంజిత్ యాదవ్, ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.