ఉన్నత విద్యావంతురాలు ఆమెకు ఉన్నన్ని అర్హతలు మరే అభ్యర్థికీ లేవు
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
సమస్యలపై అవగాహన ఉన్నది
పరిష్కరించే చొరవా ఉన్నది
అందుకే నాకు ఓటేయ్యండి
పట్టభద్రులకు వాణీదేవి వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పక్షాన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేస్తున్న సురభి వాణీదేవి ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగినవారని.. గొప్పవిద్యావేత్త అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. బుధవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ ‘సంస్కరణల శీలి, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, సీఎంగా, కేంద్రమంత్రిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత పదవి అయిన ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన తొలి దక్షిణభారత రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీని ముఖ్యమంత్రి కేసీఆర్ 360 డిగ్రీస్ పర్సనాలిటీ అని అభివర్ణించారు. అటువంటి ఉదాత్త కుటుం బం నుంచి వచ్చిన వాణీదేవిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించా రు. వాణీదేవి విద్యావేత్తగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. 35 ఏండ్లు విద్యారంగంలో పనిచేసిన అపార అనుభవాన్ని ఆమె సొంతం చేసుకున్నారు.
ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి కూతురును అనే అహంభావం లేని నిరాడంబమైనవారు వాణీదేవి. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆమెతో ఇష్టాగోష్ఠిగా చర్చించినప్పుడు అనేక సుగుణాలు అబ్బురపరిచాయి. తాను మాజీ ప్రధాని బిడ్డను అనే అహంభావం గానీ, అతిశయం కానీలేని వ్యక్తి. ప్రధానిగా పీవీ పనిచేసిన కాలంలో కూడా ఆమె ఆ పదవిని అడ్డుపెట్టుకొని, ఆ పదవిని దుర్వినియోగం చేయలేదు. జెఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ నుంచి మొదలుకొని స్వతహాగా విద్యా సంస్థల్ని నెలకొల్పి వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. మహబూబ్నగర్ మెట్టినింటి బిడ్డ. ఇవన్నీ పరిశీలించిన తరువాత సీఎం కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారుచేశారు. ఈ స్థానానికి పోటీచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇతరులకు వాణీదేవికున్న అర్హతలు, అనుభవం, సానుకూలతలు ఉన్నాయా? అని విద్యావంతులు, మేధావులు ఆలోచించాలి. ప్రభుత్వంలో ఉండి సమస్యల్ని పరిష్కరించగలిగే అవకాశం, సానుకూలతలు మిగతా వారికి ఉంటాయా? అన్న విషయాన్ని దృష్టిలోపెట్టుకుంటే అందరికన్నా వాణీదేవికే ఎక్కువ అర్హతలున్నాయి’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.