హైదరాబాద్: తెలంగాణలో తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ల స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర రెడ్డి తన స్థానాన్ని నిలుపుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ- బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావును టీఆర్ఎస్ అభ్యర్థి.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తనయ సురభి వాణీదేవి మట్టి కరిపించారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపులో తొలి, ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడానికి యువత మనస్సును కలుషితం చేసిన విపక్షాల ఎత్తులను సీఎం కేసీఆర్ తనదైన శైలిలో చిత్తు చేశారు. ప్రత్యేకించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడంలో చతురత ప్రదర్శించారు.
క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థిని ఎంచుకోవడంలో తనదైన మార్క్ ప్రదర్శించారు. ప్రత్యర్థులు సైతం మనస్సులో మెచ్చుకునేలా సురభి వాణీదేవిని ఎంపిక చేశారు. సురభి వాణీదేవిని అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేయడంతో విపక్షాలు బెంబేలెత్తాయి. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మూడవ, నాల్గవ స్థానాలకు పరిమితం అయ్యాయి. అసత్యాలే ప్రచారం చేయడం అస్త్రంగా ముందుకు వెళ్లిన కమలానికి కళ్లు బైర్లు కమ్మేలా వ్యూహాన్ని రూపొందించారు సీఎం కేసీఆర్.
ఈ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో ఏకైక స్థానం గల బీజేపీకి ఇక ప్రాతినిధ్యం లేకుండా చేయడంలో టీఆర్ఎస్ విజయవంతమైంది. తమకు చరిత్ర తప్ప భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ కన్ఫమ్ చేసుకున్నట్లయింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు ప్రాతినిధ్యం వహించే ఆరు జిల్లాల్లోని పట్టభద్రులు అధికార టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చాణక్యం ముందు విపక్షాలు తలొంచాయి. ఒకసారి వ్యూహం రూపొందిస్తే తిరుగులేదని సీఎం రాజకీయ వ్యూహం రుజువు చేసింది. అంతే కాదు సీఎం కేసీఆర్ కర్తవ్య బోధ పార్టీ శ్రేణుల్లో వెయ్యి ఏనుగుల బలాన్ని నింపింది.