ఖలీల్వాడి డిసెంబర్ 14: సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి నిరూపితమైందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా సహచర టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గతంలో ఎన్నడూ లేనంతగా స్థానిక సంస్థలు బలోపేతం కావడంతోపాటు అభివృద్ధి పరుగులు పెట్టిందని ఈ ఫలితాలతో మరోసారి రుజువైందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
తిరుగులేని రాజకీయ శక్తి: ఎమ్మెల్యే జీవన్రెడ్డి
ఆర్మూర్, డిసెంబర్ 14 : ఎన్నికలు ఏవైనా.. టీఆర్ఎస్కు తిరుగులేదని, రాష్ట్ర ప్రజానీకం సీఎం కేసీఆర్ వెన్నంటే ఉన్నారనేది స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో మరోమారు రుజువైందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. టీఆర్ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని చాటిచెప్పామన్నారు. స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నింటినీ టీఆర్ఎస్ గెలుచుకోవడంపై సంతోషం వ్యక్తంచేశారు. ఘనవిజయం సాధించిన భానుప్రసాదరావు, ఎల్.రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, తాతా మధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు : నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్రావు
నిజామాబాద్సిటీ, డిసెంబర్14: ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు శుభాకాంక్షలు తెలిపారు. భానుప్రసాదరావు, ఎల్.రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, తాతా మధులకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్సీ కవితను కలిసిన మాచారెడ్డి ఎంపీటీసీలు
మాచారెడ్డి, డిసెంబర్ 14 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన ఎంపీటీసీలు ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితను మంగళవారం హైదరాబాద్లో కలిశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను కలిసినవారిలో ఇన్చార్జి ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బూస శ్రీను, శ్రీనివాస్, రాజనర్సు, బట్ట రమేశ్, కూచని శేఖర్, కడెం నారాయణ, రామ్మోహన్, రాజు, గంగారెడ్డి, చంద్రూనాయక్ తదితరులు ఉన్నారు.