జమ్మికుంట : హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి మధ్యే పోటీ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంటలో ఆదివారం ధర్మపురి, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, జమ్మికుంట పట్టణ టీఆర్ఎస్ నాయకుల సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చందర్, నరేందర్, ఎమ్మెల్సీ సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో గొప్పగా అభివృద్ధి చేస్తుంటే.. ప్రధాని మోదీ దేశాన్ని సర్వనాశనం పట్టిస్తున్నారని ఆరోపించారు. 24గంటలు ఉచిత కరెంటు, రైతుబంధు, బీమా, ఆసరా పింఛన్లు, గురుకులాలు, సాగు, తాగునీటి సరఫరా తదితర చాలా అంశాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు.
మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టారీతిన పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సుపరిపాలన అందిస్తున్నాడని, మోదీ మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత 18 రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట కూడా లేవన్నారు. టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను విమర్శించే కనీస అర్హత బీజేపీ నాయకులకు లేదన్నారు. వాళ్లకు ఓట్లడిగే నైతికత లేదన్నారు. బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యొద్దో ? టీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు విడమరిచి చెబుదామంటూ పిలుపునిచ్చారు.
మనమంతా టీఆర్ఎస్, కేసీఆర్ సైనికులమని, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. ప్రతి గల్లీ, ప్రతి గడపకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. సమావేశంలో రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జమ్మికుంట మునిసిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్పర్సన్ స్వప్న, స్వప్న, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, నాయకుడు సమ్మిరెడ్డి, కౌన్సిలర్లు మల్లయ్య, రాము, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.