ఎన్నిక ఏదైనా.. గులాబీ పార్టీదే విజయం
2014 నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఇదే తీరు
మూడింట రెండొంతుల ప్రజలు టీఆర్ఎస్వైపే
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్ఎస్వైపేనని మరోసారి స్పష్టమైంది. లోక్సభ, అసెంబ్లీ, ఎమ్మెల్సీతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు స్పష్టమైన విజయాన్ని కట్టుబెడుతున్నారు. 2014 శాసనసభ ఎన్నికల నుంచి తాజా ఎమ్మెల్సీ ఎన్నికలవరకు టీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతున్నది.
2014 అసెంబ్లీ ఎన్నికలు
తెలంగాణ ఏర్పడిన సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 63 స్థానాలను గెలిపించి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 34.3 శాతం టీఆర్ఎస్కు రావటం గమనార్హం.
2018 శాసనసభ ఎన్నికలు
ప్రత్యేక రాష్ట్రంలో రెండోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరింత పట్టు బిగించింది. మొత్తం 88 సీట్లను కైవసం చేసుకొని తనకు తిరుగులేదని స్పష్టంచేసింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 46.9 శాతం ఓట్లు టీఆర్ఎస్కు రావటం విశేషం. 2014 ఎన్నికలతో పోల్చితే ఇది 12.6 శాతం అదనం.
2019 లోక్సభ ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది నెలల్లోనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 9 మంది లోక్సభ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. ఇతర పార్టీలు 8 స్థానాల్లో గెలిచినా ఓట్ల శాతంలో మాత్రం టీఆర్ఎస్ దూకుడు తగ్గలేదు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి 41.3 శాతం ఓట్లు వచ్చాయి.
ఎమ్మెల్సీల్లోనూ అదే దూకుడు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ దూకుడు తగ్గలేదు. 2015లో జరిగిన నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఘనవిజయం సాధించారు. మొత్తం పోలైన 1,53,547 ఓట్లలో ఆయనకు మొదటి ప్రాధాన్య ఓట్లు 59,764 ఓట్లు వచ్చాయి. ఇది 44.74 శాతం. తాజా ఎన్నికల్లో మొత్తం 3,87,969 ఓట్లు పోలవ్వగా, చెల్లిన ఓట్లలో పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓట్లే 1,10,840 రావటం విశేషం. ‘హైదరాబాద్’ స్థానంలో మొత్తం 3,58,348 ఓట్లు పోలవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 1,89,339 ఓట్లు సాధించారు. చెల్లిన మొత్తం ఓట్లలో ఇవి 56.17 శాతం. ఈ స్థానంలో 2015లో కంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 20 శాతం ఓట్లు పెరగడం గమనార్హం.
మూడింట రెండొంతులు
ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రెండు నియోజకవర్గాలు రాష్ట్రం లో దాదాపు మూడింట రెండొంతుల వరకు ఉంటాయి. పాత 10 జిల్లాల్లో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోకి 6 జిల్లాలు వస్తాయి. ఖమ్మం, వరంగల్, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పరిధిలోని 77 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇది మొత్తం స్థానాల్లో మూడింట రెండొంతులని (65.54 శాతం) చెప్పవచ్చు. అంటే రాష్ట్రంలోని మూడింట రెండొంతుల పట్టభద్రులందరూ టీఆర్ఎస్కు పట్టం కట్టారని అర్థం.