హైదరాబాద్ : ఈ నెల 7న జలవిహార్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల స్థాయి టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం జలవిహార్లో సమావేశం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 7న ఉదయం 10.30గంటలకు జరిగే సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
నగర పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు, డివిజన్ అధ్యక్షులు పాల్గొంటారన్నారు. సమావేశంలో పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలో చేపట్టనున్న బూత్, డివిజన్, నగర కమిటీల నియామకంపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ భవిష్యత్లో చేపట్టనున్న కార్యక్రమాలపై సమీక్షించడం జరుగుతుందని చెప్పారు. 60 లక్షల సభ్యత్వాలతో దేశంలోనే టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా గుర్తింపు పొందిందని తెలిపారు.
తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్న నేపథ్యంలో స్వయం పాలనతోనే మన ప్రాంత అభివృద్ధి సాధ్యమని, అది తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందని భావించిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2001 సంవత్సరంలోలో ఏర్పడినదే టీఆర్ఎస్ పార్టీ అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నాటి ఉద్యమనాయకుడు నేటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నాయకత్వంలో గడిచిన ఏడేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి దిక్సూచిగా నిలిచిందన్నారు.
కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, మల్లన్న సాగర్, కొండపోచమ్మ వంటి సాగునీటి ప్రాజెక్టుల, పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, రైతులకు పంట పెట్టుబడి కోసం రైతులకు ఎకరానికి రూ.5వేలు చొప్పున ఆర్థిక సహాయం పంపిణీ, భూగర్బ జలాలను పెంచేందుకు మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడిక తీయడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అంతేకాకుండా అభివృద్ధిలో అట్టడుగున ఉన్న దళితుల జీవితాలను బాగు చేయాలనే సదుద్దేశంతో దళిత బంధును అమలు చేస్తుంటే దానిపై కూడా విమర్శలు చేయడం విచారకరం అన్నారు.
రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతుంటే కండ్లు ఉన్న కబోదులుగా మాట్లాడుతుండడం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో నూతనంగా ప్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణం, పుట్ఫాత్ల నిర్మాణం పార్కుల అభివృద్ధి, రహదారుల నిర్మాణ వంటి అనేక పనులు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మంత్రి వెంట పార్టీ నేతలు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, సామా ప్రభాకర్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, నరేందర్ నాయి, ఎంఎన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.