న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ.. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి పార్టీ గా మార్చాలని ఇవాళ ఆ పార్టీ ఎంపీలు కోరారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి కేసీఆర్ పంపిన లేఖను తెరాస ఎంపీలు అందజేశారు. లోక్సభ ఫ్లోర్లీడర్ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే కేశవరావుతో పాటు ఇతర ఎంపీలు లేఖలు అందజేశారు.
తెరాస ఎంపీలు చేసిన విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్ వెంటనే స్పందించారు. పార్టీ పేరును ఇకపై భారాస గా మార్చాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు. తెరాస ఎంపీల విజ్ఞప్తి పై లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూడా సానుకూలంగా స్పందించారు. పార్టీ పేరు మార్పును పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఎంపీలకు తెలిపారు.